Chandrababu: ఇతడికి ఎంత కొవ్వెక్కిందంటే పవన్ కల్యాణ్ కే సవాల్ విసురుతున్నాడు: కాకినాడలో చంద్రబాబు

  • కాకినాడలో ప్రజాగళం సభ
  • కాకినాడలో ప్రజా స్పందన కేక పుట్టిస్తోందన్న చంద్రబాబు
  • ఒక్క చాన్స్ అని కరెంటు తీగలను పట్టుకుంటే షాక్ కొడుతుందని అప్పుడే చెప్పానని వెల్లడి
  • నా మిత్రుడు పవన్ రియల్ లైఫ్ లో గబ్బర్ సింగ్ అని వ్యాఖ్యలు
Chandrababu slams Kakinada MLA

టీడీపీ అధినేత చంద్రబాబు కాకినాడ ప్రజాగళం సభలో పాల్గొన్నారు. కాకినాడ ప్రజాగళం సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే కేక పుట్టిస్తోందని అన్నారు. ఇది మనకు అత్యంత కీలక సమయం అని, మే 13వ తేదీన జరిగే పోలింగ్ రాష్ట్ర గతిని మార్చాలని పిలుపునిచ్చారు. సమయం లేదు... జాగ్రత్తగా ఉండాలి... ఇతరులను చైతన్యవంతులను చేయాలి... అబద్ధాలకోరు అయిన ఈ సైకో ముఖ్యమంత్రిని ఏం చేయాలి? అంటూ ప్రసంగం ప్రారంభించారు. 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ది మొదటి నుంచీ ఒకటే మాట... వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు... అందరం కలవాల్సిన అవసరం ఉందని చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని వివరించారు. నన్ను, పవన్ కల్యాణ్ ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు... వాటన్నింటినీ మేం అధిగమించింది మీ బిడ్డల కోసమే అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

"నేను గత ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాను. ఒక్క చాన్స్ అని కరెంటు తీగలను పట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పానా, లేదా? కొట్టిందా, లేదా ఇప్పుడు? ఆనాడు చేతులెత్తి జోడించి మరీ చెప్పాను... మీరు నా మాట వినలేదు. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే, ఇక్కడ కాకినాడలో ఒక సైకో తయారయ్యాడు. బందిపోట్లను మించిపోయారు. 

కాకినాడ అంటే నాకు చాలా అభిమానం. నేను మెచ్చిన నగరం ఈ కాకినాడ. చిన్నప్పుడు మేం కాకినాడ గురించి వినేవాళ్లం... ఆ తర్వాత స్వయంగా చూశాను. ఆపై కాకినాడ అభివృద్ధికి పాటుపడ్డాను. బ్రిటీష్ పాలన కాలం నుంచి స్ట్రెయిట్ రోడ్లు ఉండే ఏకైక నగరం కాకినాడ. కేంద్రం సహకారంతో స్మార్ట్ సిటీగా చేయాలని సంకల్పించిన తర్వాత ఇక్కడికి అనేకసార్లు వచ్చాను. ఇక్కడ ఏవిధంగా సుందరీకరణ చేశానో మీరే చూశారు. 

అలాంటి కాకినాడ ఇప్పుడు గంజాయి కేంద్రంగా, డ్రగ్స్ క్యాపిటల్ గా తయారైంది. దొంగ బియ్యం రవాణా కేంద్రంగా తయారైంది. అన్ని రకాల దోపిడీలతో పాటు పేకాట కూడా ఈ పెద్దమనిషికే కావాలి. ఈయన మామూలు వ్యక్తి కాదు... జగన్ మోహన్ రెడ్డి బినామీ. ఆయన ఆస్తులు ఈయన పేరుతోనే ఉన్నాయి. ఈయనొక దొంగ, ఆయనొక గజదొంగ. 

ఇక్కడుండే ఎమ్మెల్యే చాలా మంచివాడంట. ఇలాంటి వాడ్ని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. ఈ నగరాన్ని నాశనం చేసినవాడ్ని బొంద పెట్టాలి, బంగాళాఖాతంలో కలిపేయాలి. సైకో అధికారంలోకి వచ్చి అమరావతిని నాశనం చేశాడు. పోలవరంను గోదావరిలో కలిపేశాడు. పరిశ్రమలను తరిమేశాడు. ఊరికొక సైకోను తయారు చేసి ప్రజల భవిష్యత్తును కాలరాశాడు. 

తూర్పు గోదావరి జిల్లా అంటే ప్రశాంతతకు మారు పేరు. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ కూడా పౌరుషంగా మాట్లాడరు. ఎంతో మర్యాద ఇచ్చే మనుషులు ఇక్కడివాళ్లు. ఎవరైనా మంచి నీళ్లు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే సంస్కృతి మీది. ఈ ఐదేళ్లలో ఏం జరిగింది? రౌడీయిజం వచ్చిందా, లేదా? నేరాలు పెరిగాయా, లేదా? గంజాయి వచ్చిందా, లేదా? ఏంటీ అరాచకం...? 

పవిత్రమైన గోదావరి సాక్షిగా చెబుతున్నా... ఈ దుర్మార్గులు వచ్చి జిల్లాను మరో పులివెందులగా మార్చాలనుకుంటే వదిలిపెడతామా? ఇక్కడుండే ఎమ్మెల్యేకి ఎంత కొవ్వెక్కిందంటే పవన్ కల్యాణ్ కే సవాల్ విసురుతాడు. పవన్ కాలి గోటికి సరిపోని నువ్వు ఆయన గురించి లెక్కలేకుండా మాట్లాడతావా? ఖబడ్దార్... ఎవరితో పెట్టుకుంటున్నావో గుర్తుపెట్టుకో! దోపిడీ చేయడమంత ఈజీ కాదు నిన్ను నువ్వు కాపాడుకోవడం! 

రౌడీలను నిర్దాక్షిణంగా అణచివేసిన పార్టీ టీడీపీ. నా మిత్రుడు పవన్ కల్యాణ్ నిజజీవితంలో కూడా గబ్బర్ సింగ్. అందుకే మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోండి. రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఎక్కడిక్కడ కొవ్వెక్కి, డబ్బు మదంతో విర్రవీగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వాళ్లకు కళ్లెం వేసే బాధ్యత మాది. 

మాది ప్రజా మేనిఫెస్టో... జగన్ వి నకిలీ నవరత్నాలు. ప్రజా మేనిఫెస్టో గలగలలాడుతుంటే జగన్ మేనిఫెస్టో వెలవెలపోయింది. మా మేనిఫెస్టో పట్ల ప్రజల్లో ఎక్కడికి వెళ్లినా ఒక నమ్మకం వచ్చింది. అటు కేంద్రంలో మోదీ గ్యారెంటీ కూడా ఇచ్చారు. కేంద్రం పథకాలను కూడా అనుసంధానం చేసుకుని రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం" అని చంద్రబాబు వివరించారు.

  • Loading...

More Telugu News